Thursday, October 16, 2008

వెలుగు బాటలైన వలస జీవులు - వరవరరావు

ముంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిల పోలికలు, తేడాల గురించి పిట్టల రవీందర్ చేసిన పరిశీల న, విశ్లేషణ (ఆంధ్రజ్యోతి 12 ఆగస్ట్ 2008) చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మరిన్ని ఆలోచనలను రేకేత్తించేదిగా ఉన్నది. వ్యవసాయ జీవితంలోకి వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు వచ్చినపుడు కొత్త ఉత్పత్తి శక్తుల వికాసం, కార్మిక వర్గం ఏర్పడడం, కార్మిక చైతన్యం, ఆ చైతన్యం తిరిగి గ్రామీణ రైతాంగ జీవితంపై చూపే ప్రభావం - ఇవన్నీ బొగ్గుబాయి, ముంబాయిలకు వలస పోయిన తెలంగాణ పల్లె ప్రజల జీవితాల నుంచి వివరించవచ్చు.

దుబాయి వలసల్లో ఇప్పటికి తెలంగాణ పట్ల ఒక సాంస్క­ృతిక చైతన్యాన్ని మాత్రం చూడగలుగుతున్నాం. దుబాయికి వలస వెళ్తున్న వారిలో రాయలసీమ, ముఖ్యం గా కడప జిల్లా నుంచి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. చక్రవేణు కథ ‘కుపైట్ సావిత్రి’లో ఈ వలస జీవితంలోని మాననీయ కోణాన్ని చూడవచ్చు. ఈ వలసలన్నింట్లోనూ రైతాం గం కార్మికులుగానో, కాంట్రాక్టు లేబర్‌గానో, రాను రాను రిక్షాలు తొక్కేవాళ్లు, ఆటోలు నడిపేవాళ్లు, ఒళ్లమ్ముకునే వాళ్లు, బిచ్చమెత్తేవాళ్లు గానో మారిన, మారుతున్న వైనమేకానీ ఆధిపత్యమో, దోపిడియో ఎక్కడా కనిపించవు.

ఈ వలసజీవులు వెళ్లిన ప్రాంతాల ప్రజల జీవితాలను సౌకర్యవంతం చేసి తాము మురికి గుడిసెల్లో బతుకీడుస్తున్న ఉదంతాలే ముంబాయి, సూరత్, భివాందీ మొదలైన అన్ని ప్రాం తాల్లో కనిపిస్తాయి. ఇటువంటి జీవితాలు ఈడుస్తూ కూడా వీళ్లు తెలంగాణలోని పోరాటాల నుంచి ఉత్తేజాన్ని పొందు తూ అక్కడి ప్రజలకు కూడా వికాసాన్ని యిస్తున్నారు. నైజాం వ్యతిరేక, బ్రిటిష్ వ్యతిరేక తెలంగాణ పోరాటం లో అజ్ఞాతంలోని రైతాంగ గెరిల్లాలు ఎంత పాత్ర నిర్వహించారో బొగ్గు బావుల్లోని కార్మికులు అంత పాత్ర నిర్వహించారు. పిట్టల రవీందర్ రాసినట్లు బొగ్గుబావులకు వలస బొంబాయి, దుబాయిలకు వలస వంటిది కాదు.

తెలంగాణ జిల్లాల్లోని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని రైతు కుటుంబాలు, ఒక ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే అందరికీ సరిపడ భూమి లేనపుడు ఇంటికి ఒకరైనా బొగ్గుబాయి ఉద్యమానికి పంపించారు. ఆ ఆదాయాలు అప్పటి ఉమ్మడి కుటుంబాల వ్యవసాయ జీవితానికి చన్నీళ్లకు వేడినీళ్లు అయినవి. ఆ కార్మిక చైతన్యమూ గ్రామాలు వెట్టి బతుకుల నుంచి మేల్కొనడానికి తోడ్పడింది. ముఖ్యంగా సింగరేణి బొగ్గుబావులు గోదావరిలోయ పొడుగునా ఆదిలాబాదులో బెల్లంపల్లి నుంచి కరీంనగర్‌లో గోదావరిఖని మీదుగా వరంగల్ (భూపాలపల్లిలో బొగ్గుబావులు తవ్విన తర్వాత), ఖమ్మంలో కొత్తగూడెం, మణుగూరు దాకా విస్తరించి సింగరేణి బొగ్గుబావుల పేరుతో గోదావరి తీర రైతాంగ పోరాటానికి కత్తి అంచువలె పనిచేసినవి.

ఇంగ్లండుకు బొగ్గు ఎగుమతి చేయడానికి బ్రిటిష్ వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఈ గనులు ఇటు నైజాం పెట్టుబడులు, అటు బిర్లా పెట్టుబడులు - వెరసి బ్రిటన్ పారిశ్రామిక ప్రయోజనాలు అనే మూడు అంశాలు ఇమిడి ఉండడం వల్ల ఇక్కడ పుట్టుకు వచ్చిన కార్మిక వర్గం సామ్రాజ్యవాద, భూస్వామ్య, పెట్టుబడిదారీ దళారీలకు వ్యతిరేకంగా పోరా డే బాట వేసినట్లయింది. అందుకోసమే రైలు మార్గం కూడ పడి, గోదావరిలోయ విద్యుతుత్పత్తికి కూడా దోహదం చేసి విప్లవానికి పెట్టుబడి అనివార్యంగా కూర్చిన ప్రేరకాలైనవి.

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఏకకాలంలో రైతాంగ పోరాటాలను, కార్మికవర్గ పోరాటాలను, బుద్ధిజీవుల పోరాటాలను కూడ చేపట్టింది. కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడి మగ్ధూం మొహియొద్దీన్, సర్వదేవభట్ల రామనాథం నాయకత్వంలో బట్టల మిల్లుల్లో కార్మిక సంఘాలు ఏర్పడడంతో పాటు, సింగరేణి బొగ్గు గనుల్లో శేషగిరిరావు నాయకత్వంలో సింగరేణి కార్మిక సంఘం కూడా ఏర్పడింది. శేషగిరి నాయకత్వంలో బొగ్గు బావులలోని కార్మికులు చేసిన మహత్తర పోరాటాలను పి.చంద్ తన నవల ‘శేషగిరి’లో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఎంతో ప్రామాణికమైన చారిత్రక ఆధారాలతో రాసిన జీవిత చరిత్ర వంటి నవల అది.

సాహు, అల్లం రాజయ్య చారిత్రక నవల ‘కొమురం భీం’లో కూడా 1940లలో బెంగాల్ తేయాకు తోటల కార్మికుల అనుభవాన్ని కొమురం భీం ఆదిలాబాద్ జిల్లాకు తెచ్చి కలిగించిన చైతన్యం ప్రస్తావన వస్తుంది. జగిత్యాల, సిరిసిల్లా పోరాటాలు ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో రగుల్కొన్న చైతన్యంతో, ఆ చైతన్యాన్ని రగిలించిన యువకులు తమ ఊళ్లల్లో ఉండడం అసాధ్యమైనపుడు ఎక్కువమంది బొగ్గు బావుల్లో పనిచేయడానికి వెళ్లారు. ప్రతి రైతు కుటుంబం నుంచి బతుకుదెరువు కోసం పోయే అనూచాన సంప్రదాయానికి తోడు ఇదొక విప్లవావసర వలస అయింది.

ఇటువంటి యువకులే బొగ్గు బావుల్లో పనిచేసే కార్మికుల జీవితాలను బాగు చేయడానికి సింగరేణి కార్మిక సమాఖ్యను ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారాలు ఎక్కడో కలకత్తాలో ఉన్న కోల్ ఇండియా కేంద్ర కార్యాలయంలో కాకుండా వేజ్ బోర్డు దిగివచ్చి పారదర్శకంగా బొగ్గు బావుల మీద కార్మికుల సమక్షాన పరిష్కారించాలన్న మిలిటెంటు పోరాటాలతో సికాస విజయం సాధించింది. జీతాలు, అలవెన్సులు వంటి ఆర్థిక పోరాటాలే కాకుండా కార్మిక జీవితాల్లో సమగ్రమైన వికాసం తెచ్చే, జీవితంలోని అన్ని రంగాలను స్పృశించే పోరాటాలను సికాస నిర్వహించింది.

కార్మికవర్గ పోరాట చైతన్యానికి సికాస, అటువంటి నిర్మాణ నాయకత్వానికి రమాకాంత్ పర్యాయ పదాలయిపోయాయి. బహుశా దేశంలో మరెక్కడా ఒక స్పష్టమైన పోరాట రాజకీయ దృక్పథంతో ఒక కార్మిక సంఘం ఇట్లా ఏర్పడడం చూసి ఉండం. సికాస నుంచే గోదావరి లోయ పొడుగునా జననాట్యమండలి బృందాలు ఏర్పడినవి. అమరుడు సుధ, అల్లం వీరయ్య వంటి వాళ్లు అద్భతమైన సెమ్మాసు పాటలు రాసారు. పి.చంద్ నవలలన్నింటికీ కార్యక్షేత్రం బొగ్గుబావే. స్వయం గా బొగ్గుబావి కార్మికుడైన తుమ్మేటి రఘోత్తం రెడ్డి కథలు, ‘నల్లవజ్రం’ నవల ఈ బొగ్గుబావి నుంచి తవ్వితీసి సాన బెట్టినవే.

అల్లం రాజయ్య ‘అగ్నికణం’ నవల, మరికొన్ని కథలకు మూలాలిక్కడివే. ముఖ్యంగా సికాస చరిత్రాత్మక సమ్మెకాలంలో బొగ్గుబావుల దగ్గర చేరిన కార్మికుల చర్చల నుంచి, పోరాటాల నుంచి ‘బొగ్గు పొరల్లో’ కథలు, నాటకం కూడా రూపొంది ‘కొలిమంటుకున్నది’ నవల శ్రవ్య, దృశ్య సాహిత్య, సాంస్కృతిక సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయినవి. బెల్లంపల్లి నుంచి ఈ సికా స చైతన్యాన్నే పెద్ది శంకర్ మహారాష్ట్రలోని సిరొంచ అడవిలోని ఆదివాసుల మధ్యకు తీసుకుపోయాడు. ఆ నిప్పురవ్వే ఇవ్వాళ దండకార ణ్య పోరాట దావానలమైంది. చేనేత కార్మికుల వలసలకు కూడ ఇంత సుదీర్ఘమైన పోరాట చరిత్రే ఉన్నది.

ఇది షోలాపూర్‌తో ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యంలోని మరఠ్వాడ ప్రాంతానికి బొంబాయి రాష్ట్రంలోని సరిహద్దు పట్టణం షోలాపూర్ - చాలా పెద్ద చేనేత పట్టణం. ఆ పట్టణంపై, పరిసర ప్రాంతాలపై ఇటు తెలంగాణ రైతాంగ పోరాట ప్రభావం, అటు బొంబాయిలో కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని ట్రేడ్ యూనియన్ ప్రభావాలు ఉండేవి. తెలంగాణ పల్లెలనుంచి బతుకు దెరువుకోసం ఎక్కువ సంఖ్యలో చేనేత కార్మికులు ఇక్కడికే వెళ్తుండేవాళ్లు. అందువల్ల కూడ ఇక్కడ తెలంగాణ రైతాంగ పోరాట ప్రభావం ఎక్కువ.

సాయుధ పోరాటం ప్రారంభమైనాక రెండు ఉరిశిక్షలు పడిన నల్లా నర్సింహులు (కడివెండి, జనగామ తాలూక) జైలునుంచి తప్పించుకొని ఈ షోలాపూర్ వెళ్లి అజ్ఞాత జీవితం గడిపి, పోరాట విరమణ తర్వాత తిరిగివచ్చాడు. ఈ కాలం నుంచే బొంబాయి, భివాండీ, సూరత్‌లకు చేనేత కార్మికుల వలసలు ప్రారంభమైనా 1980లలో తెలంగాణలో రాజ్యహింస, నిర్బంధాలతో ఇవి మరీ ఎక్కువైనవి. కోరుట్ల మెట్‌పల్లి వంటి ప్రాంతాల నుంచి రోజూ బొంబాయికి, దుబాయికి వెళ్లే బస్సులను చూస్తే ఈ వలసలను అర్థం చేసుకోవచ్చు.

బొంబాయి బస్తీల్లో, భివాండీ, సూరత్ మురికివాడల్లో నికృష్టమైన బతుకు బతుకుతున్న ఈ తెలంగాణ కార్మికులు సిరిసిల్లా జగిత్యాల పోరాటల తర్వాత ఆ ప్రాంతాల్లో నిర్మించిన కార్మికోద్యమాలైనా, సాంస్కృతికోద్యమాలైనా తాము కరిగిపోతూ చుట్టూ వెలుగులు ప్రవరిస్తున్న జీవితాలకు దాఖలాలు. బొగ్గుబాయి, బొంబాయి ‘వలసలు’ సృష్టించినటువంటి కార్మిక వర్గాన్ని హైటెక్ పరిశ్రమలు, బహుళజాతి కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండలులు సృష్టించగలవా? లేనపుడు అవి పరిశ్రమలు అవుతాయా? అది అభివృద్ధి అవుతుందా?

వ్యవసాయ జీవితానికి, రైతాంగానికి, గ్రామీణ వృత్తులకు అండ గా ఉండే పరిశ్రమలన్నీ మూత పడిపోతున్నవి. రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని క్రమంగా రద్దు పరచి సేవారంగాన్ని పెంచుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యవసాయరంగానికే కాదు, వ్యవసాయ సంబంధ పరిశ్రమలకు కూడా శత్రువు. కోస్తా, ఆంధ్ర వలసీకరణకు తెలంగాణ బలి అవుతున్నదని భావించే తెలంగాణ వాదులు బొగ్గుబాయి, బొంబా యి ‘వలసలు’ సాధించిన ఈ అనుకూల ఫలితాలను కాపాడుకోవాలంటే పాలకుల వలసీకరణకు, కష్టజీవుల బతుకు దెరువు వలసలకు మధ్యనున్న ఈ గుణాత్మక వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి.

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: ఆగష్టు 26, 2008

No comments: