పెండ్యాల వరవర రావు అందరికీ వి.వి గా సుపరిచితులు. ఆయన నవంబర్ 3,1940 లో వరంగల్ జిల్లా లోని చిన్న పెండ్యాల అనే గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు రాయడం మొదలుపెట్టారు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్ లోని సీ.కే.ఎం కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసారు. వరవర అంటే శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం.
నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించారు.జనవరి 1970 లో తోటి కవులతో స్థాపించిన తిరగబడు కవులు కొన్నాల్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి 1970 జూలై 4 న విప్లవ రచయితల సంఘం (విరసం) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. వారు ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడు గా ఉన్నారు, 1984 నుండి 1986 వరకు కార్యదర్శి గా కూడా ఉన్నారు. 1983 లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడు గా మరియు 1993 వరకు ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు.
రెండు దశాబ్దాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఎన్నో కేసులు బనాయించి పీడిస్తూనే ఉంది. 1980 లలో ఆయన ప్రాణానికి కుడా ముప్పు కలిగింది. మొత్తం మీద 18 కేసులు పెట్టగా, 1973 నుండి దాదాపు 6 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. 1985-89 లో రాం నగర్ కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులో, శిక్ష అనుభవించారు. 1986 లో టాడా (TADA) చట్టం కింద మోపబడిన రాం నగర్ కుట్ర కేసు ఇంకా కోర్టులోనే ఉంది. మిగిలిన 17 కేసులలో కోర్టు ఆయనని నిర్దోషిగా ప్రకటించింది.
రెండు దశాబ్దాలు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన సృజన పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి 1992 వరకు 200 సంపుటులుగా అచ్చైన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేదాన్ని ఎదుర్కొంది. వి.వి జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించినది. ఆమెకు కూడా 1978 మరియు 1984లో జైలు జీవితం చవిచూడక తప్పలేదు.
విరసం 35 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు మరియు యువకులకు స్పూర్తినిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ, తెలుగు భాషలో విప్లవోద్యమమై నిలిచింది.
సాహిత్య విప్లవోద్యమంలో భాగంగా వరవరరావు ఏడు కవితా సంకలనాలు, 1983 లో తెలుగులో - తెలంగాణా విముక్తి పోరాటం - తెలుగు నవల - సమాజం, సాహిత్యం ల పరస్పర సంబంధంపై ఒక పరిశీలన (Ph.D. Thesis in Telugu; Telangana Liberation Struggle – Telugu Novel – A study into interrelationship of society and literature) అనే ఒక పరిశోధనా గ్రంథం, 1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు.
1968-88 లలో ప్రజలపాటగా జానపదాల పరివర్తన అనే అంశం మీద 1991-94 లో పరిశోధన చేసారు. డిసెంబర్ 1988 నుండి ఏప్రిల్ 1989 వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఆంధ్ర ఫ్రభ లో ప్రచురితమైన వి.వి రాసిన ‘Letters from jail’ స్వేచ్చాప్రియులైన ఎంతో మంది రచయితలను ఆకట్టుకుంది, 1989 లో ఈ ఉత్తరాలను సహచరులు అనే సంకలనంగా తెలుగులో ప్రచురించారు.
1985–89 జైలు నిర్బంధంలో ఉండగా వి.వి గూగీ వ థ్యాంగో రాసిన “Devil on the cross”, “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో స్వేచ్ఛా సాహితి ప్రచురించింది.
జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి CPI-ML (పీపుల్స్ వార్ )కు ప్రతినిధిగా వ్యవహరించారు.తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆదిలోనే విఫలమయింది.
మరలా 2004-2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి ప్రతినిధిగా వ్యవహరించారు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 18, ఆగస్టు 2005 న CPI (మావోయిస్టు),విరసం, ఇంకా ఇతర ప్రజాసంఘాలపై నిషేధంతో ముగిసింది.
విరసంపై నిషేధం విధించిన 24 గంటలలోనే 19, ఆగస్టు 2005 తెల్లవారు జామున అయిదున్నర గంటల ప్రాంతంలో వరవర రావును మలక్ పేటలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసారు.అరెస్టు చేసిన తరువాత ప్రభుత్వం ఆయనపై మొత్తం 9 కేసులు పెట్టి ఆయన జైలు రిమాండును పొడిగించింది. ఆయనమీద పబ్లిక్ సెక్యూరిటి చట్టం కింద పెట్టిన కేసును 31 మార్చి 2006 న కోర్టు కొట్టేసింది. అప్పటికే ఆయనకు మిగిలిన కేసులలో బెయిలు దొరకడంతో ఏడున్నర నెలల తరువాత ఆ రోజు ఆయనను జైలు నుండి విడుదల చేసారు.
No comments:
Post a Comment